
బెంగాల్ కు చెందిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన విద్యా సంపద, దయాగుణం చూసి అచ్చెరువొందని వారు లేరంటే అతిశయోక్తి కాదు. బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ప్రముఖ పాత్ర పోషించారాయన.
అప్పట్లో ఆయన బ్రిటీష్ ప్రభుత్వం నిర్వహించే ఒక సంస్కృత కళాశాలలో సంస్కృతం బోధించేవారు. ఒకసారి ఆ సంస్థలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఖాళీ ఏర్పడింది. ఆ ప్రిన్సిపల్ అందుకు విద్యాసాగర్ సరైన వ్యక్తి అని అనుకున్నాడు. కానీ విద్యాసాగర్ అందుకు ఒప్పుకోలేదు.
ఆ ప్రిన్సిపల్ ఎందుకని అడిగాడు.
“ఎందుకంటే నా కంటే సంస్కృతం బాగా తెలిసిన వారు ఇంకొకరున్నారు. ఈ పదవికి వారే అర్హులు” అన్నారు.
అప్పుడా ప్రిన్సిపల్ “చూస్తుంటే బతకనేర్చిన వాడిలా లేవు. నీకు డబ్బు అవసరమా? లేదా? నీవు పెద్ద కుటుంబాన్ని పోషించాలని గుర్తుంచుకో. మీ సహోదరులు నీమీదనే ఆధారపడి ఉన్నారు. నాకు నీ మీద ఎనలేని విశ్వాసం, గౌరవం ఉన్నాయి. కాబట్టి ఈ పదవిని నువ్వే స్వీకరించాలి” అన్నాడు.
అయినా విద్యాసాగరుడు తన పట్టు వదల్లేదు. “నాకన్నా ఎక్కువ పరిజ్ఞానం గలవారు ఇంకొరున్నారు. ఆయన సాక్షాత్తూ మా గురువులు” అన్నాడు.
“నీతో నేను అంగీకరించలేను” అన్నాడు ఆ ప్రిన్సిపల్.
“మీరెన్ని చెప్పినా సరే, నాకు మాత్రం ఆ పదవి స్వీకరించడం ఇష్టం లేదు” అన్నాడు విద్యాసాగర్.
“సరే! ఆ పదవికి ధరఖాస్తు చెయ్యాలంటే ఎల్లుండి దాకే సమయముంది. మీ గురువు గారు అందుకు అప్లై కూడా చేయలేదు. లేకపోతే దాన్ని అధికారికంగా గుర్తించలేము ” అన్నాడు.
“అలా అయితే నేనే మా గురువు గారింటికి వెళ్ళి అప్లికేషన్ తీసుకు వస్తాను” అన్నాడు విద్యాసాగర్.
సుమారు యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఆయన గురువు గారి దగ్గరకు వెళ్ళాలంటే విద్యాసాగర్ కొన్ని గ్రామాలు దాటి వెళ్ళాలి. దాన్ని దాటాలంటే ఎద్దుల బండి ఉండాలి. లేకపోతే నడకే శరణ్యం. ఆయన విద్యా సంపన్నుడు, దయా సంపన్నుడేకానీ శారీరక బల సంపన్నుడు కాదు. ఆయనికి అంత దూరం నడవాలంటే నిజంగా కష్ట సాధ్యమైన పనే. ఆ రోజు మధ్యాహ్నమే బయలు దేరి మరుసటి రోజుకు వారి గురువుగారిల్లు చేరాడు. గురువు గారు విద్యాసాగర్ ఎందుకోసం వచ్చాడో తెలుసుకోగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయన్ని ఒక్కసారిగా గట్టిగా కౌగలించుకున్నాడు.
“భగవంతుడు కరుణా సముద్రుడయ్యా! నువ్వు నా మీద కరుణతో అంత దూరం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నడిచి వచ్చావు. పేరులోనే ఈశ్వరుణ్ణి పెట్టుకున్నావు. సాక్షాత్తు భగవత్స్వరూపుడివయ్యా నీవు” అని ఆశీర్వదించాడు.
విద్యాసాగర్ ఆ అప్లికేషన్ ని నింపి, గురువు గారి చేత సంతకం చేయించుకున్నాడు. మళ్ళీ యాభై మైళ్ళు వెనక్కి నడిచి తన గ్రామాన్ని చేరుకునే సరికి బాగా అలిసిపోయాడు. కానీ తన గురువు గారికి ఉద్యోగం లభిస్తుందన్న ఆనందం మాత్రం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ ప్రిన్సిపల్ మాత్రం కుర్చీ లో కూర్చుని మారు మాట్లాడలేకపోయాడు. అసలీ విద్యాసాగర్ లాంటి మనుషులు ఈ భూమ్మీద ఇంకా ఉన్నారా? అని ఆశ్చర్యపోయాడు.
అప్పట్నించీ విద్యాసాగర్ కి నెలకి యాభై రూపాయలు లభిస్తే ఆయన గురువు గారికి తొంభై రూపాయాలు లభించేది.
ఈశ్వర్ చంద్ర బిర్సింగా గ్రామము (నేటి పశ్చిమ బెంగాల్) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబము లో జన్మించాడు. బాల్యమంతా పేదరికము తో గడుపుతూ ఎంతో పుస్తకజ్ఞానము సంపాదించెను. తండ్రి సంస్కృత ఉపాద్యాయుడు కావడము చేత కొడుకు కూడ ఆదే వృత్తిని అవలంబించాడు. మొదట గ్రామములో పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తరువాత తండ్రికి కలకత్తాలో 1828 లో ఉద్యోగము దొరకడము తో కలకత్తాకు మారెను. ఒక చుట్టము మధుసూదన్ వాచస్పతి , ఈశ్వర్ నుసంస్కృత కళాశాల కు పంపమని కోరగా అక్కడికి పంపబడెను.
1849 లో కాలేజీ నుండి రాజీనామా చేసి, అభిమానుల ప్రోద్బలము తో ఒక సంవత్సరము తరువాత విద్యా విభాగము లో అతని కోసము ఏర్పరిచిన సాహిత్య టీచర్ పదవిని వరించెను. ఆతను కాలేజీలో పైన చెప్పిన మార్పులు జరుగ వలెనని కోరెను. స్కూల్ ఇన్స్పెక్టర్ పదవి లో 20 స్కూళ్ళను స్థాపించెను. ఆ తరువాత ఫోర్ట్ విలియమ్స్ కాలేజీ మూతబడి కలకత్తా విశ్వవిద్యాలయము ప్రారంభము కాగా విద్యాసాగర్ స్థాపక సభ్యుడయ్యెను. ఆ తరువాత సంస్కృత ప్రెస్ అత్యంత సాఫల్యము చెంది అతని శక్తులన్నిటినీ వాడుకొనెను. ఆప్పటికే ఈశ్వర్ చంద్ర మహిళల హక్కుల కొరకు పోరాటము ప్రారంభించెను.
విద్యాసాగర్ ఔన్నత్యము విశాల హృదయము కలవాడని అతనిని ఎరిగిన వారు ఒప్పుకుందురు. ఆ రోజుల్లో చాలామంది సంస్కర్తల లాగే విద్యాసాగర్ ధనవంతుడు కాదు. ఆనాటి ధనికులకున్న అహంకారము లేకపోవడము వలన సమాజములో అదృష్టము లేనివారి పై కనికరము చూపడానికి వీలైనది. చిన్న, పెద్ద ఆందరికీ సహనము, వినయము లను నేర్పించెను. స్వామి వివేకానంద మాట్లాడుతూ "ఉత్తర భారత దేశములో విద్యాసాగర్ నీడ సోకని నా వయస్సు కలవాడు ఎవ్వడూ లేడు" అన్నాడు.
No comments:
Post a Comment